March 25, 2024

 

పుట్టిన ఊరిలో  మార్పులు తీసుకురావాలనే కలతో ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు తిరిగి వచ్చాడు అలీ.  రాజస్థాన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన అలీ  మియో  ప్రాంతంలో సామాజిక పరిస్థితులను మెరుగుపరచడం ద్వారా తన ముద్రవేశాడు. భరత్‌పూర్ జిల్లాలోని నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాజీబ్ అలీ (40) సాధారణ రాజకీయ నాయకుల వంటి వాడు కాదు.

నగర్ బ్లాక్‌లోని సిక్రి గ్రామంలోని మియో ముస్లిం కుటుంబంలో జన్మించిన అలీ, 2005లో ఉన్నత చదువులు చదవడానికి మొదట న్యూ ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియాకు వెళ్లి ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. 2013లో భరత్‌పూర్‌కు తిరిగి వచ్చి నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు, కాని భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనితా సింగ్ చేతిలో ఓడిపోయాడు.

అలీకి ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్ వంటి నగరాల్లో తన ఇద్దరు సోదరులతో కలిసి ఎనిమిది కళాశాలలు, ఒక పాఠశాలను నడుపుతున్నాడు. డిసెంబరు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలీ  నగర్ స్థానం నుండి బహుజన సమాజ్ పార్టీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2019లో, అలీ మరో ఐదుగురు BSP ఎమ్మెల్యేలతో కలిసి అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. స్థిరమైన రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతున్నామని ఈ ఎమ్మెల్యేలు అప్పట్లో ప్రకటించారు. రాజస్థాన్‌లో కర్నాటక తరహా తిరుగుబాటును పునరావృతం చేసే ప్రయత్నంలో బిఎస్‌పి ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి బిజెపి ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళు కాంగ్రెసులోకి ఫిరాయించారు. 2020లో అప్పటి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాటు కారణంగా ఏర్పడిన రాజకీయ సంక్షోభ సమయంలో అలీ, అతని తోటి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మద్దతు ఇచ్చారు.

ఆగష్టు 2022లో రాజస్థాన్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్‌పర్సన్‌గా అలీ నియమితులయ్యారు. తూర్పు రాజస్థాన్‌లో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, సామాజిక పరిస్థితులను మెరుగుపరచాలనే కోరికతో తాను భారతదేశానికి తిరిగి వచ్చానని అలీ చెప్పారు. “ఇది రాజస్థాన్‌లో అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. పైగా, మీవో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులను అనుమానంతో చూస్తారు, ”అని ఆయన అన్నారు.

తన ఎన్నికల ప్రచారంలో, అలీ ఓటర్లను ఒప్పించడంలో విజయం సాధించారు. నగర్ నియోజకవర్గంలో అన్ని కులాల ప్రజలు నాకు ఓటు వేశారు. వారి కోసం

 

ఏదైనా చేయాలని ఆస్ట్రేలియాలో నా సౌకర్యాలను త్యాగం చేశానని ఓటర్లు విశ్వసించారు అని ఆయన తృప్తిగా తెలియజేశాడు. రాజకీయాల్లో నిచ్చెనమెట్లు ఎక్కేందుకు ఉపయోగించే మతతత్వం, ద్వేషపూరిత ప్రచారాల ఆలోచనలను తాను ఓడించినట్లు చెప్పాడు.  ఎన్నికైనప్పటి నుండి, గ్రామస్థుల జీవన ప్రమాణాలను పెంచడానికి అలీ తన నియోజకవర్గంలో విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ”ప్రభుత్వ విద్యా వ్యవస్థ నాణ్యతను మెరుగుపరచడానికి నేను కృషి చేస్తున్నాను. ప్రైవేట్ విద్య పరిష్కారం కాదు. పటిష్టమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థ మాత్రమే ప్రతి ఒక్కరికీ

ప్రయోజనం చేకూరుస్తుంది,” అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆరోగ్య రంగానికి సంబంధించి, ప్రభుత్వ సౌకర్యాల పరిస్థితి అంతకుముందు గ్రామాల్లో దయనీయంగా ఉండేది.  అలీ ప్రయత్నాల వల్ల పరిస్థితి మెరుగుపడింది. వివిధ వేదికలపై వారి సమస్యలను లేవనెత్తడం ద్వారా ముస్లింలు తదితర అట్టడుగు వర్గాలకు ఉపశమనం కలిగించాడు.

అలీ నిరంతర కృషి ఫలితంగా, గత నెలలో అసెంబ్లీలో సమర్పించిన 2023-24 రాష్ట్ర బడ్జెట్‌లో నగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి అనేక ప్రకటనలు వచ్చాయి. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన బాలికల కోసం హాస్టల్ నిర్మాణం, కొత్త ఉప-జిల్లా ఆసుపత్రి, వ్యవసాయ కళాశాల ఏర్పాటు, బురద ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు,  ఖోహ్ జాలుకి గ్రామ పంచాయతీలను ఉప-తహసీల్‌లుగా అప్‌గ్రేడ్ చేయడం వంటి ప్రకటనలు ఇందులో ఉన్నాయి.

ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ముందు, ఆ తరువాత తూర్పు రాజస్థాన్ ప్రాంతంలో అలీ చేసిన నిస్వార్థమైన, అంకితభావంతో కూడిన సేవలు ఒక నిజమైన నాయకుడు ఎలా ఉండాలో తెలుపుతున్నాయి.  ముస్లిం యువకులు ప్రజా సేవ రంగంలో ప్రవేశించి సాధించగలిగే విజయాలేమిటో తెలియజేస్తున్నాయి.