March 21, 2024

(ప్రముఖ రచయిత, అనువాదకులు అబుల్ ఫౌజాన్ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. ఎమ్మే ఇస్లామిక్ స్టడీస్, ఎమ్మే ఉర్దూ చదివిన ఫౌజాన్ కు ఇస్లామ్ సాహిత్యంపై మంచి పట్టుంది. ఎంతటి క్లిష్టమైన ఉర్దూ గ్రంథాన్నయినా తేట తెలుగులో అనువదించడం ఫౌజాన్ ప్రత్యేకత. ఫౌజాన్ పరిశోధన గ్రంథం ‘ఔరంగ జేబు’ పుస్తకం మంచి ఆదరణ పొందింది. 600పేజీల ఈ గ్రంథం ఎంతోమంది పెద్దల ప్రశంసలు అందుకుంది. ఆచార్య వకుళా భరణం రామకృష్ణ, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, డాక్టర్ నలిమెల భాస్కర్, ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకులు ఈ పుస్తకానికి ముందుమాటలు రాశారు. అబుల్ ఫౌజాన్ గారి గురించి ప్రముఖ కవి,రచయిత,విమర్శకుడు రజాహుస్సేన్ గారు  రాసిన వ్యాసం ఇక్కడ అందిస్తున్నాము.)

స్వతంత్ర రచనలు , అనువాదాలు ఫౌజాన్ గారి  రెండు కళ్ళు.ఈ రచయిత అసలు పేరు…ముహమ్మద్ సర్వర్.కలం పేరు ..అబుల్ ఫౌజాన్.(ఈ పేరుతోనే ఆయన రచనలు వెలువడ్డాయి).
పుట్టింది…..15..8..1948. పోత్కపల్లి రైల్వేస్టేషన్, ఓదెలమండలం, కరీంనగర్ జిల్లా(ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) శాశ్వత నివాసం..కరీంనగర్. చదివింది..ఏం.ఏ.ఇస్లామిక్ స్టడీస్.ఎం.ఏ. ఉర్దూ..హిందీ భాషారత్న. వృత్తి.. డిప్యూటీ తహశీల్దార్..(రిటైర్డ్)
ప్రవృత్తి..రచనలు..అనువాదాలు
ఇంతవరకు అచ్చైన స్వతంత్ర.అనువాద రచనలు33. ఇవికాకుండా కథలు,కథానికలు, వ్యాసాలు అనువాదాలు 400 దాటాయి.
అచ్చులో వున్న పుస్తకాలు 12 వరకు ఉన్నాయి.
సామాజిక,.ధార్మిక,చారిత్రక, ఆర్థిక విషయాలకు సంబంధించి అనేక రచనలు చేశారు.వాటి వివరాలు..!!
1.ముస్లిం సమగ్ర జీవితం
2.ప్రవక్త సహచరులు సందేశం సరళి
3.దాంపత్య సంబంధాలు విచ్ఛిన్నం
4.ఇస్లాం స్త్రీ కిచ్చిఃదేమిటి?
5.వివాహ శుభాకాంక్షలు
6.లైంగిక సంబంధాలు.. ప్రకృతి నియమాలు
7.ఇస్లాం..సుశిక్షణా వ్యవస్థ
8.ఇస్లాం..ధ్యేయమేమిటి?
9.బాలికల సామూహిక సంహారం
10.మానవుని ఆర్థిక సమస్యలు..వాటి ఇస్లామీయ పరిష్కారాలు
11.బర్జఖ్ (పితృలోకం)
12.మత సామరస్యం.. ఔరంగజేబు
13.దైవ ప్రవక్త సందేశం సరళి.మన బాధ్యతలు
14.ఇస్లాంపై విమర్శలు..సమాధానాలు
15.ధర్మ ప్రవేశంలో నిర్బంధం లేదు
16.బాలికల భ్రూణ హత్యలు..దాని పరిష్కారం
17.మహా వృక్షాలు(మౌలానామౌదూది జీవితకథ)
18.భారతీయ ధార్మిక గ్రంధాల్లో మహనీయ ముహమ్మద్.
19.ఇస్లాం..అపార్థాలు
20.ప్రపంచ ధర్మాల్లో దైవభావన
21.షహీదె..వతన్.అష్ఫాఖుల్లాఖాన్ (ఉర్దూ)
22.ఆఖరి ఇటుక
23.వడ్డీ..కీడు
24.ఆధునిక యుగంలో వడ్డీ సాధ్యమా?
25.రఫయదైన్ విషయంలో వివరణ
26.సత్య ధర్మ పరిశోథకులు
27.శుచి శుభ్రతకు..నమాజు నియమాలు
28.భారత మూలం జాతి ఎవరు?
29.దళిత వెతలు.. పరిష్కార మార్గమేదీ?
30.ముక్తికి స్వేచ్ఛకు మార్గమేదీ?
31.శకీల్..బిన్..హనీఫ్..మోసపు వాస్తవికత.
32.ఇస్లాం..చారిత్రక పాత్ర.
33.దళిత సమన్వయ మూల మెప్పుడు?
ఈరచయిత గీటురొయి వారపత్రికలో రెగ్యులర్ గా వ్యాసాలు రాస్తూ ఉండేవారు. గీటురాయి వారపత్రక వేదికగానే ఈయన రచనా ప్రస్థానం మొదలయ్యింది.
*ఔరంగజేబు పై ప్రత్యేక పరిశోథన…!!
*ఔరంగజేబు ” రచన డాక్టరేట్ థీసిస్ కంటే గొప్పది !!
మొగలాయి చక్రవర్తి ఔరంగజేబు గురించి ఈయన విస్తృతంగా పరిశోథించారు. తొలుత “ఔరంగజేబు..మత సామరస్యం” గురించి ఓ చిన్న పుస్తకం రాశారు. కర్నూలు లో జరిగిన హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ సమావేశంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సదస్సు లో పాల్గొన్న అనేక మంది పెద్దలు ఆ పుస్తకాన్ని మెచ్చుకున్నారు.అలా ..ఔరంగజేబు పై ఆసక్తి కలిగి ..లోతుగా పరిశోధిహథించారు. ఫలితంగా 616 పేజీల పరిశోథనా గ్రంథం రూపుదిద్దుకుంది. ఔరంగజేబు పరిశోథన ఎంతోలోతుగా. ప్రామాణికంగా జరిగింది.రచయిత ఫౌజాన్ గారు ఈ పుస్తకం కోసం ఎన్నో సంవత్సరాలు పరిశ్రమించారు. పరిశోథించారు.ఎన్నో దూర ప్రాంతాలను సైతం సందర్శించారు.రాత ప్రతుల్ని చదివారు.గొప్ప గొప్ప చరిత్రకారులను కలిశారు.గ్రంథాలయాల్లో గడిపారు. ముఖ్యంగా పార్సీ భాషలో వున్నఒరిజినల్ డాక్యుమెంట్ లను ఉర్దూ భాషలోకి అనువదించు కున్నారు.ఆయన పడిన కష్టం ఈ పుస్తకంలో కనబడుతుంది. ఎన్ని పుస్తకాలు తిరగేశారో ? ఎన్ని రాతప్రతుల్ని చదివారో ? ఎందరెందరిని కలిసి మాట్లాడారో..ఈ పుస్తకంలోని ఫుట్ నోట్స్‌,రిఫరెన్సుల్ని చూస్తే తెలుస్తుంది. ఫౌజాన్ గారు ఓ రాక్షసుడిలా పనిచేశారనడం బాగుంటుందో లేదో కానీ…ఆయన కష్టం మాత్రం వెల కట్టలేనిది.ఇప్పుడు యూనివర్సిటీల్లో వస్తోన్న ఎన్నో పిహెచ్ డి థీసిస్ ల కంటే కూడాఇది గొప్పది.‌ నిజమైన పరిశోథన ఎలా వుండాలో ..ఈ పుస్తకాన్ని చూస్తే తెలుస్తుంది. ఈ పుస్తకంలో 27అథ్యాయాలున్నాయి. ప్రతీ అథ్యాయం కూడా ప్రత్యేకమైనదే.. ఔరంగజేబు జీవితం..రాజకీయం..పాలనకు సంబంధించిన అనేక విషయాలతో పాటు.‌ ఆయనపై వచ్చిన విమర్శలకు సమాధానంగా రచయిత ఇచ్చిన వివరణను తప్పక చదవాలి. ఫౌజాన్ గారు ముస్లిం అయినా కూడా…మతాభిమానంతో కాకుండా…కేవలం వాస్తవికతపైనే దృష్టి పెట్టి
సత్యం నిరూపణకోసం కృషిచెశారు. నిజానికి ఇంత విస్తృతమైన పరిశోథన యే ఒక్క వ్యక్తి కూడా చేయలేరు. ఓ యూనివర్సిటీనో.‌లేక ఓ సంస్థో..పీఠమో చేయాల్సిన పనిని ఫౌజాన్ గారు ఒంటి చేత్తో చేసి చూపించారు. అందుకు ఆయన అభినందనీయులు. ఆయన కృషిని
ఇంతవరకు ఏ యూనివర్సిటీ కూడా గుర్తించక పోవడం విచారకరం..ఈ గ్రంథానికి గౌరవ డాక్టరేట్ ను సునాయాసంగా ఇవ్వొచ్చు. కానీ మన యూనివర్సిటీలు ఇటువంటి మౌలికమైన పరిశోథనల పై దృష్టి పెట్టడం మానేశాయి.
*ఔరంగజేబు “. పుస్తకం పై పెద్దల కితాబు….!!
*ఔరంగజేబు పై ఇంతటితో విస్తృత గ్రంథం తెలుగులో రావడం ఇదే ప్రథమం . చరిత్రను పనిగట్టుకుని రాసినట్లు గాక ..కథాకథన రీతి
విసుగు లేకుండా సాగింది. రచనాశైలికి చదివించే గుణం మెండు.ఆధారాలను పేర్కొంటూనే..ప్రజారంజక చరిత్ర రాయడమెలాగో ఈ గ్రంథం సూచి
స్తుంది. గ్రంథ కర్త వృత్తిరీత్యా చరిత్ర కారుడు కాకున్నా..చరిత్రకు లేనిపోని రంగులు పులమ కుండా కువిమర్శలకు చోటు లేకుండా రాశాడు”
                                                                                                                                                                                     -ఆచార్య వకుళాభరణం రామకృష్ణ.!!
ప్రామాణిక చారిత్రక ఆధారాలు, ప్రముఖ చరిత్రకారుల , మేధావుల రచనల్ని క్షుణ్ణంగా చదివి బేరీజు వేసుకొని న్యాయ బద్ధమైన నిష్పక్షపాత
విశ్లేషణమే ఈ గ్రంథం. రచయిత పాటించిన చరిత్ర పరిశోథన పద్ధతి.ప్రమాణాలు మెచ్చుకోదగ్గవి. అత్యంత వివాదాస్పదమైన విషయాన్ని
పరిశోథనకు ఎంచుకొని ,దానికి న్యాయం చేయడం అంత సులువు కాదు.. కానీ ఈ రచయిత ఆ పనిని ఆచరణలో చేసి చూపించాడు.”!!
                                                                                                                                                                                     -ఆచార్య అడపా సత్యనారాయణ.!!
ఈపుస్తకం చదివాక .. ఔరంగజేబు గురించి ఇప్పటిదాకా మన సమాజంలో చెలామణిలో వున్న నకారాత్మక భావాల్లో చాలా మట్టుకు తప్పుడు అభిప్రాయాలని తెలిసివస్తుంది. ఔరంగజేబు కూడా ఒక పరిపాలకుడు అని బోధపడుతుంది. అతని పాలన మతపరమైనది కాదనడానికి ఈ గ్రంథం లో అనేక రుజువులున్నాయి. బ్రిటీష్ పరిపాలనలో చరిత్రను ఎందుకు వక్రీకరించారో..ఆధారాలతోసహా మన‌ ముందు వుంచారు.”
                                                                                                                                                                                       – డాక్టర్ నలిమెల భాస్కర్ !!
*ఔరంగజేబు గురించి మంచిగా రాసే సాహసమా అని విస్తుపోయే వారు కూడా..ఈయన చెప్పే వివరాలలో ,చేసే విశ్లేషణలలో ఏదో వాస్తవం
వున్నదని గుర్తిస్తారు.అదే ఈ పుస్తకం బలం..!!‘‘
                                                                                                                                                                                         -కె శ్రీనివాస్.!?
ఇంతవరకు చరిత్ర కారులు రంగుటద్దాల్లో ఔరంగజేబు చరిత్రను చూశారు. వాళ్ళు యే రంగులో చూస్తే ఆ రంగులోనే చరిత్ర కనబడింది. ఫౌజాన్
గారు మాత్రం ఏ రంగుటద్దాలు లేకుండా చరిత్ర ను తవ్వి..చూసి.. ఔరంగజేబు పుస్తకం రాశారు. అందుకే ..ఇందులో నిజాలున్నాయి.చరిత్రకూడా
పారదర్శకంగా కనబడుతోంది.
తెలుగులో ఔరంగజేబు గురించి రాసిన అబుల్ ఫౌజాన్ తర్వాత ఈ పుస్తకాన్ని ఉర్దూలో అనువదించారు. ఉర్దూ అనువాదం పూర్తయినా ఇంకా ప్రచురణ కాలేదు. అలాగే ఇంగ్లీషులో ఈ పుస్తక అనువాదం ప్రారంభమయ్యింది. ఈ పుస్తకం ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ తదితర భాషల్లో కూడా రావలసిన అవసరం ఉంది.
ఫౌజాన్ గారు ఇకలేరన్న వార్త జీర్ణించుకోలేనిది. వారి మృతికి కన్నీటి నివాళి..వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి..!!